‘రాజును ఎదిరించే దమ్ముందా సిపాయికి?’* – హీరో ముందున్న ప్రశ్న.
*’యుద్ధం మొదలుపెట్టేదే సిపాయి’* – దానికి నితిన్ ఇచ్చిన బదులు.
‘చెక్’ ట్రైలర్లో ఓ సంభాషణ ఇది. ఆ సమాధానంలోని ధైర్యం చాలు… ఉరిశిక్ష పడ్డ ఖైదీగా జైలులో ఉన్న ఓ యువకుడు తనకు ఎదురైన పరిస్థితులతో ఏ విధంగా పోరాడాడు అనేది చెప్పడానికి! అతడి పోరాటం గురించి పూర్తిగా తెలుసు కోవాలంటే ఫిబ్రవరి 26 వరకు ఎదురు చూడాలి.
నితిన్ కథా నాయకుడిగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘చెక్’. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ కథా నాయికలు చదరంగం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ను బుధవారం సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేశారు.
‘యద్భావం తద్భవతి…అణువు నుంచి అనంతం వరకు ఏదీ కర్మను తప్పించుకోలేదు’ అని మురళీ శర్మ చెప్పిన డైలాగ్తో ‘చెక్’ ట్రైలర్ ప్రారంభమైంది. తర్వాత హీరోను జైలులోఖైదీలా చూపించారు. రెండు నిమిషాల ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘వీళ్లకు ఏ సమస్య వచ్చినా కుంగిపోరు. సొల్యూషన్ వెతుకుంటూ ఉంటారు’, ‘నువ్విక్కడ ఏం చేసినాకొన్ని కళ్లు చూస్తూనే ఉంటాయి’, ‘ఆదిత్య కేసులో క్షమాబిక్షకు అవకాశం ఉందా?’ డైలాగులు ‘చెక్’పై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ నెల 26న సినిమాను విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత వి.ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ “చెస్ నేపథ్యంలో దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి చక్కటి యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ రూపొందించారు. ఎమోషన్స్ కూడా ఉంటాయి. సినిమాను ఈ నెల 26న విడుదల చేస్తున్నాం. తొలుత 19న విడుదల చేయాలని అనుకున్నాం . అయితే, సీజీ వర్క్స్ పూర్తి కాలేదు. అందుకని, 26న వస్తున్నాం. బుధవారం విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి అద్భుతమైన స్పందన లభించింది. నితిన్ కొత్త లుక్ బావుందని ప్రశంసలు వస్తున్నాయి. చెస్ ప్లేయర్ హారిక ద్రోణవల్లి ట్రైలర్ లా వుందని ట్వీట్ చేశారు. “చెస్” నేపధ్యంలో రూపొందిన ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆమె చెప్పారు. హీరోలు సాయి తేజ్, వరుణ్ తేజ్, హీరోయిన్ కీర్తీసురేష్ తదితరులు ట్రైలర్, అందులో నితిన్ లుక్ పై ప్రశంసలు కురిపించారు. అందరికీ థాంక్యూ. ముఖ్యంగా సోషల్ మీడియాలో నితిన్ అభిమానులు, ప్రేక్షకుల నుంచి ట్రైలర్ కి అద్భుత స్పందన లభించింది. సినిమాపై అంచనాలు పెరిగాయి.ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది” అని అన్నారు.
సాయి చంద్, సంపత్ రాజ్, పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ, హర్షవర్ధన్, రోహిత్, సిమ్రాన్ చౌదరి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం : కళ్యాణిమాలిక్, ఛాయా గ్రహణం : రాహుల్ శ్రీవాత్సవ్ , ఆర్ట్ : వివేక్ అన్నామలై , ఎడిటింగ్ : అనల్అనిరుద్దన్ , ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి , నిర్మాత : వి.ఆనంద ప్రసాద్,
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : చంద్రశేఖర్ యేలేటి