న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సక్సెస్మీట్లో…
ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల మాట్లాడుతూ.. ‘నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాహుల్కి థ్యాంక్స్. నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు నిర్మాతకు థ్యాంక్స్. నన్ను గుర్తించిన నాని, సాయి పల్లవిలకు థ్యాంక్స్’ అని అన్నారు.
సత్యదేవ్ జంగా మాట్లాడుతూ.. ‘పాతికేళ్ల కల నిజమైంది. ఈ పాత్ర నిజంగా ఉందా? అని సర్చ్ చేశారట. అదే నాకు పెద్ద సక్సెస్. నన్ను, రాహుల్ గారిని నమ్మి నాని గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిర్మాతకు ఆయనే చెప్పారు. దిల్ రాజు గారు ఈ సినిమాను భుజాల మీద వేసుకుని వెళ్లడం దైవికంగా అనిపిస్తుంది. ఈ సినిమాను మిస్ అయ్యామనే బాధ జీవితాంతం ఉంటుంది. అంత మంచి ప్రాజెక్ట్. అందుకే అందరూ చూడండి. ఎన్నో సినిమాలు వస్తాయ్ పోతాయ్. నాకు, మా డైరెక్టర్కు ఇదొక బ్లాక్ బస్టర్ కళాఖండంగా నిలిపోతుందని ఆశిస్తున్నాను. రోజి పాత్రకు సాయి పల్లవి జీవం పోశారు. ఆమె నటనను చూసి చలించిపోయాను. సింహపు పిల్లలా కనిపించారు. సావిత్రి తరువాత అంత గొప్ప నటి అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
అభినవ్ గోమఠం మాట్లాడుతూ.. ‘మా సినిమాను చూసి ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. సెకండ్ వేవ్ను తట్టుకుని సినిమా చేయడానికి నిర్మాత కారణం. నాని, సాయి పల్లవి, కృతి శెట్టి గారి గురించి నేను ఏం చెప్పగలను. ఇది నాని 2.ఓ. సాయి పల్లవి గారు అద్భుతంగా నటించారు. కృతి శెట్టి గారు చక్కగా నటించారు. రాహుల్ చక్కగా తీశారు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్’ అని అన్నారు.
నిర్మాత వెంకట్ బోయనపల్లి మాట్లాడుతూ.. ‘సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీడియా కూడా చాలా సపోర్ట్ చేసింది. దిల్ రాజు గారు, శిరీష్ గారు నా వెంటే ఉంటూ చేసిన సాయాన్ని మరిచిపోలేను. కరోనా, లాక్డౌన్ సమయంలో ఎంతో కష్టపడి షూటింగ్ చేశాం. రాత్రి ఆరు గంటలకు ఇంట్లోకి వెళ్తే.. ఉదయం ఆరు గంటల వరకు కష్టపడేవారు. సాయి పల్లవి గారిని అయితే నిద్రపోనివ్వకుండా చేశాం. 45 రోజులు ఎంతో కష్టపడి చేశారు. నాలుగైదు సినిమాలు మాన్పించి మరీ ఈ ప్రాజెక్ట్ కోసం అవినాష్ కొల్ల గారిని తీసుకున్నాం. ఆయనకు ఇలాంటి మరిన్ని గొప్ప చిత్రాలు వస్తాయి. నీరజ కోన గారు అద్భుతంగా పని చేశారు. జెర్సీ సమయంలో కెమెరామెన్ సాను గారిని చూశాను. ఆయన మంచి చిత్రాలనే సెలెక్ట్ చేసుకుంటారు. ఆయన మా సినిమాను ఎంచుకున్నప్పుడే నాకు నమ్మకం కలిగింది. ఆ రోజు నుంచి సినిమా ఆడుతుందనే నమ్మకం మాకు ఉంది. నవీన్ గారు అద్భుతంగా పని చేశారు. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం బాగుంది. ఎన్ని సార్లు అడిగినా మా కోసం పని చేశారు. కృతి శెట్టి నటించిన ప్రతీ సినిమా హిట్ అవుతూనే ఉంది. శ్యామ్ సింగ రాయ్ రచనలు హీరో.. సమాజం అనేది విలన్. అదే సినిమా కథ. సాయి పల్లవి గారు కథ విన్న వెంటనే ఒప్పుకున్నారు. ఎప్పుడూ ఎక్కడా కూడా ఆలస్యం చేయలేదు. ఆమె తప్పా ఇంకెవ్వరూ ఈ పాత్రను చేయలేరు. ఆమె నాకు ఫ్యామిలీ మెంబర్. నాని గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది’ అని అన్నారు.
కృతి శెట్టి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు ఇంత మంచి స్పందన ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్. సినిమాను తెలుగు ప్రేక్షకులు ప్రేమించినంతగా మరెవ్వరూ ప్రేమించలేరు. ఈ చిత్రంలో నటించినందుకు ఆనందంగా ఉంది. నాని గారి సినిమాలు చూసి నటిగా ఎప్పుడూ స్పూర్తిపొందుతూనే ఉంటాను. ఈ సినిమాను చూశాక అది ఇంకా పెరిగింది. నటుడిగానే కాకుండా మంచి వ్యక్తిగా ఎంతో ఇన్స్పైర్ చేశారు. సాయి పల్లవి గారు అద్బుతంగా నటించేశారు. తెరపై ఆమె అందరినీ కట్టిపడేస్తారు. సత్యదేవ్ గారు అద్బుతమైన కథ అందించారు. నన్ను కొత్త పాత్రలో చూపించిన రాహుల్ గారికి థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత గారికి థ్యాంక్స్’ అని అన్నారు.
రాహుల్ సంకృత్యాన్ మాట్లాడుతూ.. ‘మా నిర్మాత మమ్మల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. ఈ రోజు ఆర్ నారాయణ మూర్తి గారిని గెస్ట్గా పిలిచి ఆశ్చర్యపరిచారు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఈ రోజుకు విలువలు, నిజాయితీతో బతికే వ్యక్తి. నిప్పులాంటి మనిషి. శ్యామ్ సింగ రాయ్ లాంటి మనిషి. ఇది వరకే సినిమా టీం గురించి అంతా చెప్పేశాను. రాయి రాయి పేర్చి గుడి కట్టామని చెప్పాను. కొరియోగ్రఫర్ కృతి మహేష్ గారికి థ్యాంక్స్. దేవదాసీలుగా నటించిన అందరికీ థ్యాంక్స్. మరో కొరియోగ్రఫర్ యశ్ మాస్టర్కి థ్యాంక్స్. ఫైట్ మాస్టర్ రవివర్మన్ గారికి థ్యాంక్స్. ప్రొడక్షన్ టీంలో ఉండే వారే రియల్ హీరోలు. మీరంతా కనిపించని రియల్ హీరోలు. మీరంతా కలిసే ఈ సినిమాను చేశారు. హిట్, సూపర్ హిట్ అని అంతా అంటారు. కానీ ఈ సినిమా చూసిన ఆడియెన్స్ క్లాసిక్ అని అంటున్నారు. మళ్లీ మళ్లీ చూడాలని ఉందంటున్నారు. ప్రేక్షకులకు ఉన్న అభిరుచి వల్లే ఇలాంటి సినిమాలు ఆడుతున్నాయి. వారికి కథ, కథనం, సాహిత్యం, సంగీతం అంటే ఇష్టమున్నాయి. అందుకే మా సినిమా నిలబడింది. ప్రతీ ఒక్క ఆడియెన్కు థ్యాంక్స్. ప్రేక్షకులకు టేస్ట్ లేదని అనడం తప్పు. మీకు నచ్చే చిత్రాలను తీస్తాను. నా జీవితంలో ముగ్గురు శ్యామ్ సింగ రాయ్లాంటి వ్యక్తులు ఉన్నారు. వారిలో మొట్టమొదటి వారు మా నాన్న ప్రసాద్ గారు. నాకు చిన్నతనం నుంచే ప్రశ్నించే గుణాన్ని నేర్పించారు. ఇక రెండో వారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఆయన ఆఖరి శ్వాస తీసుకునే సమయంలో నేను బిజీగా ఉన్నాను. మూడో వ్యక్తి నాని గారు. రియల్ శ్యామ్ సింగ రాయ్. ఆయన వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. నాకు, నిర్మాతకు అంత అనుభవం లేకపోయినా అంతా ముందే ఉండి నడిపించారు. సెక్యూరిటీ గార్డులా సినిమాను కాపాడి ఇక్కడి వరకు తీసుకొచ్చారు. కరోనా సమయంలో సినిమాను విడుదల చేయడం, ఇంత పబ్లిసిటీ చేయడం ఎంత ఒత్తిడితో కూడుకున్న పనో మాకు తెలుసు. కానీ ఆ ప్రెజర్ను మా దగ్గరకు రానివ్వుకుండా అడ్డుగోడలా ఉన్నారు. పదేళ్ల తరువాత నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నేను మొదటి సినిమా చేశాను అని గర్వంగా చెప్పుకుంటాను. పల్లవి చూడరా ఎంత చక్కగా ఉందో అని మ అమ్మ గారు అన్నారు. తెలుగు వారి గుండెల్లో సాయి పల్లవి స్థానం అది’ అని అన్నారు.
ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. ”మన సౌత్ ఇండియాలో సంక్రాంతి పండగ జరుపుకుంటాం. నార్త్ ఇండియాలో దీపావళి పండగ చేసుకుంటాం. ఈస్టర్న్ స్టేట్స్ లో నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటాం. ఇవాళ బెంగాల్ లో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఏ బెంగాల్ లో ఈ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయో ఆ ఉత్సవాలను, ఆ గొప్పతనాన్ని, ఆ కలకత్తా కాళీ నాలుక మహోన్నత బీబత్సాన్ని ఈ సినిమా ద్వారా ప్రపంచానికి చూపింది నవరాత్రి ఉత్సవాలు జరుపుకునేట్టు చేస్తున్నారు. నిర్మాత బోయినపల్లి వెంకట్ గారు ఎంత మంచి వ్యక్తి. నాని గురించి మాట్లాడుతూ ఆయన గురించి నేను ఏమి చెప్పగలంటూ అయాన్ ఏడిస్తే.. అయ్యా మీ గ్రాటిట్యూట్, సెంటిమెంట్ కి సెల్యూట్. నిర్మాత అంటే అలా ఉండాలి. అలాగే ఈ చిత్రానికి బ్యాక్ బోన్ గా నిలబడి అమోఘమైన సహాయ సహకారాలు అందించిన దిల్ రాజు గారికి నమస్కారాలు. పాప.. సాయి పల్లవి నిన్ను ఫస్ట్ టైం ఎక్కడ చూశానంటే.. రాజు గారి సినిమా ఫిదాలో చూశా. హీరోయిన్ లా కాకుండా పక్కంటిపిల్లలా ఉండే అమ్మాయి సాయి పల్లవి. తెలుగు సినిమా ఇండస్ట్రీ మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండాలి.. ఆ దశగా ప్రభుత్వం సరైన నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుతున్నా” అన్నారు.