గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. సామాన్యులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆస్తి, ప్రాణ నష్టంతో పాటు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. బాధితులను ఆదుకోవడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణ సీ ఎం సహయనిధికి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, “తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సామాన్యులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ విపత్తు వల్ల సంభవించిన వినాశనం మనం ఊహించనిది. బాధిత కుటుంబాలకు సహాయం చేయడానికి నా వంతు సాయంగా తెలంగాణ సీ ఎం సహయనిధికి కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో మన ప్రజలకు అండగా వీలైనంత సహాయం అందించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను” అని అన్నారు.