“My Baby” will remain in the minds of the audience as a great film – Senior actor Murali Mohan

అధర్వ, నిమిషా సాజయాన్ హీరో హీరోయిన్లు గా నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో నటించిన తమిళ సూపర్ హిట్ మూవీ “డీఎన్ఏ”ను “మై బేబి” పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సురేష్ కొండేటి. ఆయన యష్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ తో కలిసి తన ఎస్ కే పిక్చర్స్ పై “మై బేబి” చిత్రాన్ని ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు సురేష్ కొండేటి నిర్మాతగా, దుప్పాడిగట్టు సారిక రెడ్డి, పి.సాయిచరణ్ తేజ కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రీమియర్ షోను హైదరాబాద్ లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటులు మురళీ మోహన్, దర్శకుడు రేలంగి నరసింహారావు, సీనియర్ నటి రోజారమణి, జర్నలిస్ట్ ప్రభు, పద్మశ్రీ అవార్డ్ గ్రహీత గాయని శోభారాజు, ముత్యాల రాందాస్, శ్రీనివాస్, శరత్ జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో

సీనియర్ నటులు మురళీ మోహన్ మాట్లాడుతూ – “మై బేబి” సినిమాను మేమంతా చూశాం. ఎంతో ఉద్వేగానికి లోనయ్యాం. ఇదొక గొప్ప చిత్రంగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది. అలాగే నిర్మాతగా సురేష్ కొండేటికి మంచి పేరు తెస్తుంది. తన బిడ్డను తల్లి కేవలం స్పర్శతోనే గుర్తుపడుతుందనే గొప్ప అంశాన్ని ఈ చిత్రంలో దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ చూపించాడు. ఇలాంటివి సమాజంలో జరుగుతున్నాయంటే భయమేస్తుంది. ఈ చిత్రంలో మంచి కంటెంట్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. “మై బేబి” సినిమాలో ప్రతి ఒక్కరూ బాగా నటించారు. తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సురేష్ కొండేటి ఎన్నో మంచి చిత్రాలు తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చారు. పాతికేళ్లుగా సంతోషం సినీ వారపత్రికను నడుపుతున్నారు. ఇటీవల ఆయనకు కొంత గ్రహణం లాంటి సమయం ఏర్పడింది. కానీ ఈ చిత్రంతో ఆయనకు పట్టిన గ్రహణం వీడిపోతుంది. “మై బేబి” సినిమాను మీరంతా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. అన్నారు.

దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ – ఇటీవల మంచి సినిమాలు రావడం లేదని థియేటర్స్ కు వెళ్లడం మానేశాం. ఆ కాలంలో వచ్చిన మంచి చిత్రాలు ఇప్పుడు రావడం లేదనే విమర్శలూ ఉన్నాయి. కానీ “మై బేబి” సినిమా చూశాక..ఆ కాలం కంటే ఇప్పుడే మంచి సినిమా వచ్చిందనే భావన కలిగింది. చూస్తున్నంతసేపూ ఈ సినిమా మా మనసుల్ని కదిలించింది. “మై బేబి” సినిమాను ప్రేక్షకులంతా తమ బిడ్డలా భావిస్తారు. సురేష్ కొండేటి గారికి ఈ చిత్రంతో నిర్మాతగా మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నా. అన్నారు.

సీనియర్ నటి రోజారమణి మాట్లాడుతూ – సురేష్ కొండేటి గారు ప్రేమిస్తే, జర్నీ, నాన్న లాంటి ఎన్నో మంచి చిత్రాలు మన ముందుకు తీసుకొచ్చారు. ఆయన తెలుగు ఆడియెన్స్ కు అందిస్తున్న మరో గొప్ప మూవీ ఈ “మై బేబి” . ఈ చిత్రంలో తల్లీ బిడ్డల సెంటిమెంట్ ను అద్భుతంగా చూపించారు దర్శకుడు. సినిమా మా హృదయాల్ని హత్తుకుంది. ఈ సినిమాను మన ముందుకు తీసుకొచ్చిన సురేష్ గారికి థ్యాంక్స్. “మై బేబి” ఘన విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నా. అన్నారు.

పద్మశ్రీ పురస్కార గ్రహీత, గాయని శోభారాజు మాట్లాడూతూ – “మై బేబి” సినిమా చూస్తున్నప్పుడు ఇలాంటి అద్భుతమైన చిత్రాలు మరిన్ని రావాలి అనిపించింది. మాతృత్వం ఒక గొప్పవరం. ఆ తల్లి మనసు ఎలా ఉంటుందో చూపించేలా దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. తన బిడ్డను స్పర్శ ద్వారా తల్లి గుర్తుపడుతుంది. ఆ అంశాన్ని ఈ చిత్రంలో మనసుకు హత్తుకునేలా ఒక సన్నివేశంలో చూపించారు. “మై బేబి” సినిమా సురేష్ కొండేటి గారికి సక్సెస్ అందించాలని కోరుకుంటున్నా. అన్నారు.

ప్రముఖ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ – నా స్నేహితుడు సురేష్ కొండేటి చాలా మంచి చిత్రాలను గతంలో మనకు అందించాడు. అతను సినిమాను తీసుకొస్తున్నాడంటే అది తప్పకుండా బాగుంటుందనే నమ్మకం అందరిలో ఏర్పడుతుంటుంది. “మై బేబి” సినిమా తమిళ వెర్షన్ సాధించిన విజయం గురించి నాకు తెలుసు. సురేష్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాడని తెలిసినప్పుడు చాలామంచి సినిమా చేస్తున్నావని అభినందించాను. ఈ రోజు సినిమా చూస్తుంటే ఈ సినిమా సాధించబోయే విజయం ఎలా ఉంటుందో అర్థమైంది. అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here